వివాహ మహోత్సవ ఆహ్వానం

తేది:August 3, 2008 వర్గం:వర్తమానం రచన:చరసాల 1,220 దర్శనాలు

శ్రేయోభిలాషులందరికీ మా తమ్ముడు దిలీప్ పెళ్ళికి బ్లాగ్ముఖ ఆహ్వానపత్రం.

పెళ్ళి పత్రిక

మొసలి కన్నీరు

తేది:August 1, 2008 వర్గం:నా ఏడుపు రచన:చరసాల 986 దర్శనాలు

మనది కర్మ భూమి. “ఇది మన కర్మ, ఎవరిని నిందించి ఏమి ప్రయోజనం?”, “ఎప్పుడో చేసుకున్న పాప ఫలం ఇప్పుడు ఇలా అనుభవించాడు(రు).” ఇలా అనుకునే జనాలు, ఇలాంటి తలాతోకా లేని వాజమ్మ సిద్దాంతాలూ నమ్మే వారూ, వాటిని పకడ్బందీగా ప్రచారం చేసే ఉద్దండ పండితులూ వున్నంత కాలం, కాకతీయ ఎక్స్‌ప్రెస్ కాలుతుంది, గౌతమి మండుతుంది, బెంగుళూరు పేలుతుంది, అహ్మదాబాదు హాహాకారాలు చేస్తుంది.

ఎన్ని జరిగినా మనకు కానీ మన నాయకులక్కానీ చీమకుట్టినట్లుండదు. ఇవన్నీ కంటి తుడుపు మాటలు. నోట్లోంచీ వూడిపడేవే, గుండెలోతుల్లోంచీ వచ్చేవి కావు. తన ప్రాణం తప్ప ఏ ఇతర ప్రాణమూ మనకు తీపి కాదు. ఏ అమ్మకూ తన బిడ్డల ప్రాణం తప్ప మరే బిడ్డ ప్రాణమూ ముఖ్యం కాదు. అదేమంటే ఇలా ప్రమాదం జరిగీ జరగ్గానే అలా “చింతిస్తారు” లేదా “ప్రాణాలకు వెల కడతారు.” ఎంత సిగ్గులేని బ్రతుకులు!

బస్సులూ, రైల్లూ ఈ రోజే కొత్తగా పుట్టలేదు. వాటిల్లో క్షేమంగా ప్రయాణించడమెలాగో ఈరోజు మనమే ఓ కమిటీ వేసి తేల్చాల్సిన పని లేదు. ఈ పాట్లు అన్నీ పడి, అనుభవంతో సమస్య పరిష్కారాలు కనుక్కున్న వారిని చూసి మనం నేర్చుకుంటే చాలు. అది చూసి వస్తాం, ఇది చూసి వస్తాం అంటూ పెద్ద దేశాలకు ప్రయాణాలు కట్టే ఈ వంచకులు నిజంగా ఏమైనా చూసి నేర్చుకుంటారో లేక యాత్రా విహారాలు చేస్తారో గానీ… రైలు బోగీ నిర్మాణం ఎలా వుండాలో వీరికి తెలియదనుకోవాలా?

ఉదాహరణకు ఇక్కడి మార్క్ రైలులో వున్న సదుపాయాలు చూద్దాం. ప్రతి బోగీలోనూ ఆ చివరా ఈ చివరా ఓ గొడ్డలి, ఱంపమూ కనిపించేలా ఓ గ్లాస్ డోర్ వెనుకాల వుంటాయి. మామూలుగా ఆ తలుపుకు తాళం వేసి వుంటుంది. అయితే ఆ అద్దం మీద “అత్యవసర సమయాలలో పగుల గొట్టండి.” అని వ్రాసి వుంటుంది. అలాగే ఆ చివరా, ఈ చివరా మంటల నార్పడానికి వుపయోగించే అగ్ని నిరోధక సాధనం వుంటుంది. దానిని క్రితం సారి ఎప్పుడు తనిఖీ చేశారో, మళ్ళీ తనిఖీ ఎప్పటిలోగా చేయాలో వ్రాసి వుంటుంది. ఇక అన్నిటినీ మించి ఇంచుమించు ప్రతి కిటికీ అత్యవసర సమయాలలో నిష్క్రమణ ద్వారంగా పనిచేసేలా రూపొందిస్తారు. అత్యవసర సమయాలలో ఆ కిటికీని ఎలా తెరవాలో స్పష్టంగా ప్రతి చోటా అక్షరాలలోనూ, బ్రెయిలీలోనూ వ్రాసి బొమ్మలతో సూచిస్తారు. భోగీ లోపల ఏ కిటికీ నిష్క్రమణ ద్వారంగా మార గలదో భోగీ వెలుపల కూడా సూచిస్తారు. (బహుశా బయటి వారు సహాయ పడలనుకునే సందర్భాలలో వుపయోగ పడుతుందనేమొ!)

వీటిల్లో ఏ ఒక్కటైనా గౌతమిలో వుండి వుంటే ఈ ప్రమాదంలో ఇంత మంది చనిపోయేవారా? ఖచ్చితంగా కాదు. మన అధికారులకు, నాయకులకు ఇలా ఒకన్ని చూసి నేర్చుకునే అలవాటు లేదు. తమకుగా తెలుసుకోరు.

ఇక ప్రజలా దున్నపోతులు. “మన కర్మ” అనే దళసరి చర్మం కప్పుకున్న స్పందన రహితులు. ఈ “కర్మ సిద్దాంతమే” మనకు బలం, బలహీనతా.

రోజూ ఇక్కడ లిప్ట్ ఎక్కినప్పుడల్లా హైదరాబాదులో ఎక్కిన లిప్టులు గుర్తుకు వచ్చి మనస్సు చివుక్కు మంటుంది. ఇక్కడి లిప్టులకు ఆటోమాటిక్‌గా మూసుకునే దళసరి ద్వారం వుంటే, అక్కడి వాటికి చాలా మట్టుకు “గ్రిల్” వుంటుంది. గ్రిల్ మూశాక చిన్న పిల్లలు పొరపాటున ఆ గ్రిల్‌లో చేతులు పెడితే ఏమవుతుంది? ఇలాంటి చిన్న ప్రమాదాలనీ నివారించలేని అశక్తులమా మనం? పోనీ అక్కడి లిప్టులు తయారుచేసే కంపెనీలకు ఈ విషయం తెలియదనుకోవాలా? కానే కాదు. అవి చేసే వారే ఇక్కడా చేస్తున్నారు.

అలాగే మా వూరిలో మా యింటితో సహా గమనించిందేమంటే, డాబా మీద పిట్ట గోడకు (రక్షణ గోడ) అమర్చిన గ్రిల్. ఇక్కడెక్కడా నిలువు వూచలే తప్ప అడ్డు వూచలున్న గ్రిల్ చూడలేదు. కానీ అక్కడ మా యింటితో సహా అడ్డమూ, నిలువూ వూచలున్నాయి. అడ్డంగా నిచ్చెనలా వుంటే పిల్లలకు ఎంత సులభం వాటిని ఎక్కి ఆడుకోవడం? అలా పైపైకి వెళ్ళి కిందికి చూసేటప్పుడు పొరబాటు జరిగితే ఎంత ప్రమాదం?

వుహు. మన దళసరి చర్మానికి ప్రమాదం జరిగాక ఏడవడమే గానీ ముందుగా అది జరగ్గుండా ఏమి చేయాలన్న ఆలోచనే రాదు. పోనీ పక్కవాన్ని చూసి నేర్చుకుంటామా అంటే అదీ లేదు.

మనం కర్మను నమ్ముకున్నన్నాళ్ళూ మన కర్మ ఇంతే!

–ప్రసాద్

మా వూరి సంగతులు - ఎవరికి పిచ్చి?

తేది:July 15, 2008 వర్గం:అనుభవాలు, నా ఏడుపు రచన:చరసాల 666 దర్శనాలు

పిచ్చిఆ అమ్మాయి నా కంటే నాలుగైదేళ్ళు చిన్నదేమొ. పేరు మల్లినో, నాగమల్లినో సరిగ్గా నాకు తెలియదు. ప్రస్తుతానికి మల్లి అంటాను. వరసకి అత్త కూతురవుతుంది. ఆమెకు ఓ అక్క, ఓ సోమరిపోతు అన్న వున్నారు. అప్పుడే ఆ అన్న వూర్లో వుండక పట్టణాలు పట్టుకు తిరిగేవాడు. ఇప్పుడూ అంతే. అక్కకు పెళ్ళై మరో వూరెళ్ళిపోయింది. చిన్నప్పుడు ఈమె సిగ్గరి, అక్కలా ఎదుటపడి మాట్లాడేది కాదు. వీళ్ళమ్మకు మేమంటే చాలా అభిమానం. నేనెప్పుడు వూరొచ్చినా నన్ను చూడటానికి తప్పక ఇంటికి వచ్చేది అవసానదశలో మంచం మీద వున్నప్పుడు తప్ప.

మల్లికి పెళ్ళయింది కానీ కొన్ని రోజులకే ఏ కారణం వల్లనో భర్త వదిలేశాడు. వూరికయితే వచ్చింది గానీ, అమ్మ లేదు, నాన్న లేడు. అక్కదీ, అన్నదీ ఎవరి దారి వారిది. వూరిలో ఆ పనీ ఈ పనీ చేసుకొని పొట్ట నింపుకొని, ఏ చూరుకిందో, అరుగు మిదో పడుకొని కాలం వెళ్ళదీస్తుండేది. సరైన తిండిలేక నీరసించిన మల్లికి ఎయిడ్స్ వుందేమోనన్న అనుమానం ఎవరికో వచ్చింది. ఇంకేం ఎవరూ గడప దొక్కనీయలేదు. బక్క ప్రాణం మరింత బక్కదయింది. ఈమె దుస్థితి చూసి చలించిన మా తమ్ముడు దిలీప్ ఆమెను కడపకు తీసుకెళ్ళి వైద్యులకు చూపించి, రక్త హీనతకు మందులిప్పించి, తన స్నేహితులతో రక్తం ఇప్పించి ఆమెను మళ్ళీ మమూలు స్థితికి తెచ్చాడు. ఆ పరీక్షల్లో ఆమెకు ఎయిడ్సూ లేదు ఏ రోగమూ లేదు పోషకాహార లోపం తప్ప అని తేలింది.

బహుశా అప్పటికే ఆమెకు మతి చలించిందనుకుంటాను. ఎప్పుడూ సరిగ్గా మాట్లాడని ఆమె గలగలా మాట్లాడటం, ఏదేదో గొణగడం మొదలెట్టింది. ఇప్పుడు తను శారీరకంగా ఆరోగ్యంగా వున్నా మానసికంగా పిచ్చిదయింది. తనకు పెట్టిన అన్నాన్ని కుక్కలకు వేస్తుందిట. ఎందుకలా వేస్తున్నావు అంటే “నాకూ పుణ్యం రావాలిగా” అంటుందట. తనకు కట్టుకోమని బట్టలిస్తే అవి ఎవరికైనా ఇచ్చేస్తుందట. ఇంక వేదాంతం మాట్లాడటం, ఏదో దీర్ఘాలోచనలో వుండటం ఇలా వుంది వరస.

నేనూ, దిలీప్ వూరిలో తిరుగుతుంటే ఓ చోట గోడను ఆనుకొని అటేటో చూస్తూ వుంది. “ఏమ్మ్యా ఎలా వున్నావ్? నేనెవరో గుర్తు పట్టావా?” అని పలకరించా. అప్పుడు మా వైపు తిరిగి “దిలీపు సామీ నువ్వా!” అని రెండు చేతులెత్తి దండం పెట్టింది. “దిలీపు సరేగానీ నేనెవరో చెప్పు” అన్నా. “ఎవరో సామీ.. నేనింకా దొగలేమోనని, ఎట్ట సేయాల బగవంతుడా అని, ఇట్ట మల్లుకోనున్నా..” అన్నది. దిలీపును గుర్తు పట్టావే, దిలీపు అన్నలెవరు అంటే చెప్పింది. ఆ ప్రసాదును నేనే అంటే “ఎన్నెన్ని రోజులకు చూస్తిని సామీ” అంటూ తెగ సంతోషం ప్రకటించింది. ఆ ముందురాత్రి పడిన వర్షంలో బట్టలన్నీ తడిసిపోయాయట. ఎవరూ తమ తమ పంచల్లో పడుకోనివ్వలేదట! రాముడి గుడిలో పడుకుంటోందని గుడికి తాళాలు వేశారట! తడిసిన బట్టల్తో రాత్రంతా అలానే వున్నానని చెబుతుంటే గుండె చెరువయి కళ్ళల్లో ధార కడుతుంటే ఆపుకోవడానికి నానా కష్టాలూ పడ్డా. ఎప్పుడయినా సరే మా యింటికి వచ్చి తిను, అక్కడే పడుకో అని చెప్పి ఓ వందరూపాయలు చేతిలో పెట్టి అక్కడినుండీ భారంగా కదిలా.

ఆ మరుసటి వుదయం అన్నం కోసం ఇంటికి వచ్చినపుడు చెబుతోంది, “సామీ దొంగలున్నారంటే మీరు వింటిరా.. రాత్రి నా తలమీద గుండేస్తానని వాడెవడో దొంగ వచ్చి నీవిచ్చిన నూర్రూపాయాలూ లాక్కెళ్ళాడు.” అని.

ఇంతకూ నాకు తేలనిది ఏమిటంటే పిచ్చి ఆమెకా? వర్షం రాత్రి ఓ ఆడబిడ్డని ఏ పంచనా పడుకోనివ్వని వూరికా? చివరికి తన ఆలయంలోనూ చోటివ్వని దేవుడికా? అమాయకురాలి చేతిలోని డబ్బు భయపెట్టి లాక్కున్న మనిషికా? పిచ్చెవరికి?

–ప్రసాద్

మా వూరి సంగతులు - కస్టమ్స్ కష్టాలు

తేది:July 13, 2008 వర్గం:అనుభవాలు రచన:చరసాల 739 దర్శనాలు

అమెరికానుండీ ముడి బంగారం తీసుకెళ్ళేవాళ్ళు ఇది తప్పక చదవాలి. గత నాలుగేళ్ళుగా అప్పుడొకటీ ఇప్పుడొకటీ కొన్న ఆరు బంగారం బిళ్ళలు (ఒక్కోటి ఇంచుమించు 31 గ్రాములు) పట్టుకెళ్ళాం ఇండియా వెళ్తూ. ఇక్కడ బంగారం చవక అనీ కాదు అక్కడ ఖరీదు అనీ కాదు గానీ ఒక్కసారే కొనాలంటే కష్టం గనుక అవి అప్పుడొకటీ ఇప్పుడొకటీ కొన్నవి. అన్నిటినీ తీసుకెళ్ళి ఇండియాలో ఏదైనా పాపకు చేయించాలనే వుద్దేశ్యం మా ఆవిడది.

అయితే కస్టమ్స్ వాళ్ళ నింబంధనలేంటో నాకంతగా తెలియదు. పది కిలోల వరకు తీసుకెళ్ళవచ్చు అని మాత్రమే ఎక్కడో చదివాను. వాటిని గాజుల్లా మార్పించుకొని వెళ్ళండి, లేదా అక్కడ దాయండి, ఇక్కడ దాయండి అన్నమాటలన్నీ పెడ చెవిన బెట్టి మామూలుగా మా చేసంచీలోనే (cabin luggage) వుంచుకొని వెళ్ళాం. ఈనాడు వార్తల మాటకేం గానీ శంశాబాద్ విమానాశ్రయపు వుద్యోగుల డేగ కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి. నాకూ స్కానింగ్ చేస్తున్నాయనకూ మధ్య సంభాషణ ఇది.

ఆయన:ఈ బ్యాగు ఎవరిది?
నేను: నాదే
(దగ్గరికి పిలిచి చిన్న గొంతుతో)
ఆయన: ఇందులో బంగారు బిస్కెట్స్ వున్నాయా?
నేను: (అదే చిన్న గొంతుతో) వున్నాయి.
ఆ: ఎన్ని?
నే: ఆరు.
ఆ: కస్టమ్స్ కట్టాలే!
నే: అవునా! పది కేజీల వరకు తెచ్చుకోవచ్చని విన్నానే!
ఆ: తెచ్చుకోవచ్చు. కానీ కస్టమ్స్ కట్టాలి.
నే: అలాగా. అయితే సరే కడతాను.

అప్పుడు తను ఏదో స్లిప్పు రాసి నా చేతికిచ్చాడు. ఆ తర్వాత కస్టమ్స్ వాళ్ళు నన్ను తమ బల్ల దగ్గరికి పిలిచారు.

మళ్ళీ పై కుశల ప్రశ్నలన్నీ అయ్యాక బంగారం బిళ్ళలన్నీ బయట పెట్టించి వాటి మీదున్న బరువు వగైరా వివరాలు చూసి ఆ తర్వాత తిరిగిచ్చేశారు. ఒకరికి ముగ్గురు కూడి లెక్కలేసి చివరికి ఇంచుమించు అయిదువేల రూపాయలు అవుతుందని తేల్చారు.

ఇంతవరకూ అంతా బాగానే వుంది. అసలు విషయం ఏమిటంటే ఆ అయిదువేల రూపాయలనీ దానికి సమాన మొత్తాన్ని విదేశీ ద్రవ్యంలో చెల్లించాలట!!! నిజం చెప్పొద్దూ… నా దగ్గర పది డాలర్లకు మించి లేవు. మా ఆవిణ్ణడిగితే ఆమె బ్యాగులో అన్నిమూలలా తడిమి అరవై డాలర్లు వున్నాయంది. నా స్వతంత్ర భారతదేశంలో నాకు రూపాయలతోనే పని గానీ డాలర్లతో పని వుంటుందని నేను కలగన్నానా? డాలర్లలో ఎంతవుతుందీ అంటే ఇంచుమించు $125 అని తేల్చారు. మరి మిగతా డాలర్లు ఎక్కడ పట్టుకురావాలి? ATM రూపాయలే ఇస్తుందాయె. సరే forexలో అడిగితే ఇది విదేశీ ద్రవ్యాన్ని మార్చుకొనెందుకే గానీ స్వదేశీ ద్రవ్యాన్ని మార్చుకొనేందుకు కాదన్నారు.

అన్ని నా ప్రయత్నాలూ విఫలమయ్యాక తిరిగొచ్చి, “అయ్యా, నా దగ్గర డాలర్లు లేవు. నేను రూపాయల్లో మాత్రమే రుసుము కట్టగలను. ఇక మీరు చేసుకోగలిగింది చేసుకోవచ్చును.”  అని చెప్పా. అప్పుడాయన కాస్తంత సౌమ్యంగానే “అలాంటప్పుడు మాకున్న ఒకే ఒక ఆప్షన్ మిమ్మలనీ డిటైన్ చేయడమే!” అన్నాడు. “బాబ్బాబు మీకు పుణ్యం వుంటుంది ఆ పని చేయండి.” అన్నా. వాళ్ళు మాత్రం ఏమి చేయగలరు? వాళ్ళ నిభందనల పత్రం తెచ్చి చూపించారు. వాన్నీ వీన్నీ డాలర్లు వున్నాయా అని నా తరపున అడిగారు. చివరికి ఒకరిదగ్గర 500 దీనార్లు దొరికాయి. “అయ్యా ఇది పట్టుకెళ్ళి మీ రుసుము కట్టేసి మిగిలిన చిల్లరా, మీరు కట్టాల్సిన మొత్తం మాకు రూపాయల్లో ఇచ్చేయండి.” అన్నారు. చివరికి అలా దీనార్లు వచ్చి ఆదుకున్నాయి.

ఈ తతంగం అంతా ముగియడానికి ముప్పావు గంట పైనే పట్టింది. మాకోసం బయట ఎదురు చూస్తున్న వాళ్ళకు లోపలేం జరుగుతున్నదో ఇంకా మేమెందుకు బయటకు రావటం లేదో తెలియక గింజుకుంటున్నారు.

“కస్టమ్స్ రుసుము విదేశీ ద్రవ్యంలోనే చెల్లించాలన్న” నింభందనలో బ్రహ్మ పదార్థం మీకేమన్నా తెలుసా? (బహుశా విదేశీ ద్రవ్యానికి ఇక్కట్లు పడే రోజుల్లో చంద్రశేఖర్ ఏమైనా ఈ రూల్ పెట్టి వుంటాడా?)

–ప్రసాద్

మా వూరి సంగతులు - తెలుగు వాడి ఇక్కట్లు

తేది:July 12, 2008 వర్గం:అనుభవాలు రచన:చరసాల 609 దర్శనాలు

అమెరికా నుండీ ఇండియాకు మా ప్రయాణం ఈసారి కువైట్ మీదుగా జరిగింది. ఈ ప్రయాణంలో మరియు తిరుగు ప్రయాణంలో నన్ను బాగా వ్యధకు గురిచేసిన అంశం ఒకటుంది.

వాషింగ్టన్ డల్లస్ విమానాశ్రయం నుండీ United Airlinesలో కువైట్‌కు ప్రయాణం. మామూలుగానే విమానంలో సూచనలన్నీ ఆంగ్లం మరియు అరబ్బీలలో చెప్పారు. అలాగే బయలుదేరే ప్రదేశలో మరియు వెళుతున్న ప్రదేశంలో స్థానిక సమయం, ఉష్ణోగ్రతా వివరాలు చెప్పారు. ఇందులో ఆశ్చర్యపడాల్సిందీ చెప్పుకోదగ్గదీ ఏమీ లేదు.

అయితే అదే కువైట్ నుండీ హైదరాబాదు ప్రయాణం Kuwait Airlinesలో. సంప్రదాయం ప్రకారం అయితే బయలుదేరుతున్న ప్రదేశం మరియు గమ్యస్థానాల భాషలలో (అరబ్బీ మరియూ తెలుగులలో) సూచనలు ఇవ్వాలి. ఇంకో విధంగా చూసినా ఆ విమానంలో 80 శాతం మంది తెలుగు మాతృభాషగా వున్నవారే వున్నారు. ఆ విధంగా చూసినా తెలుగులో సూచనలు వుండాలి. వుహు, నా అంచనాలకు విరుద్దంగా ఆంగ్లం, అరబ్బీ మరియూ హిందీలలో సూచనలు ఇచ్చారు. సరే ఈ కువైటీలకు మన తెలుగు తెలిసి చావదులే అనుకొని సరిపెట్టుకున్నా.

ఇక నా తిరుగు ప్రయాణం కువైట్ మీదుగానే అయినా ఇది హైదరాబాదు నుండీ కువైట్‌కు  Air Indiaలో. ఇప్పుడు మాత్రం సూచనలు తెలుగు, అరబ్బీ, ఆంగ్లాలలో వుంటాయని ఆశించా. వుహు.. నేను పప్పులో కాలేశా. ఇప్పుడు కూడా ఆంగ్లం, హిందీ మరియూ అరబ్బీలలోనే వినిపించారు. నా పక్క సీట్లో ఓ ముసలాయన కూచున్నారు. కర్నూలు దగ్గర ఓ పల్లెట. కువైట్‌లో తన కూతురు దగ్గరకు వెళుతున్నానని చెప్పారు. ఆయనకు బహుశా ఈ విమాన ప్రయాణం మొదటిదిలా వుంది. ఈ మూడు బాషలూ ఆయనకు డబ్బాలో గుళకరాళ్ళ శబ్దంలా వుంది తప్ప ఏదీ అర్థం కావట్లేదు. నేను కాస్తా చొరవచేసి తెలుగులో మాట్లేడేసరికి ఆయన మహదానందపడిపోయి ఎడారిలో ఒయాసిస్సు దొరికినంత సంబరపడ్డాడు.

కువైట్ జనాభా ఇంచుమించు 30 లక్షలు. కువైట్ వైశాల్యం 17,818 sq km. మన రాష్ట్ర జనాభా 8 కోట్ల పైమాటేనా? మన రాష్ట్ర వైశాల్యం 2,76,754 sq km లట! అయినా తెలుగు మాత్రమే తెలిసిన మన తెలుగు వాడికీ దుర్గతి ఏమిటి?

అదేగాక హైదరాబులో దిగే ముందు కస్టమ్స్ వాళ్ళ declaration forms ఇచ్చారు. అవి ఆంగ్లం మరియు హిందీలలోనే వున్నాయి. ప్రయాణీకుల్లో తెలుగు రాయడం, చదవడం వచ్చినా అవి నింపడానికి నాలాంటి వాళ్ళను బ్రతిమాలుకుంటున్నారు. దీనివల్ల వాళ్ళు నేర్చుకొనే పాఠమేమిటి? తమ పిల్లలకైనా హిందీనో, ఇంగ్లీషో నేర్పిస్తే ఈ యాచించే బాధ తప్పుతుందనేగా!

మరో అన్న మళ్ళీ రావాలి.

–ప్రసాద్